Showing posts with label హైద‌రాబాద్‌. Show all posts
Showing posts with label హైద‌రాబాద్‌. Show all posts

Monday, 30 November 2015

The City Never Sleep



భాగ్యనగరం..ముత్యాల రాశుల ఉద్యానవనం. రాతి శిలలపై వెలిసిన రాజ భవనాలిక్కడ.. నది ఒడ్డున నిలిచిన శ్వేత సౌధాలిక్కడ.. ఇరానీ రుచుల మలాయి మీగడలు... బిర్యానీ గుమగమలు... ఉస్మానియా బిస్కెట్లు.. ముషాయిరాల వాహ్వాలు. చెప్పుకునేవి..తెలుసుకునేవి ఎన్నెన్నో ఈ మహానగరంలో. అందుకే... హైదరాబాద్ అందమైన పాలరాతి శిల్పం. కవి గాయక కళా నిలయం. భాగమతి కాలి అందెల సవ్వడికి జతకూడిన కుతూబ్ గీతం ఈ నగరం. ప్యాలెస్‌లు, దేవ్డీలు, కోఠీలు, కమాన్‌లు, దర్గాలు, మందిరాలు ఇలా అడుగడుగునా కొలువుదీరిన కట్టడాలెన్నో ఈ నేల మీద. అవి వినిపించే చారిత్రక గాథలు ఎన్నెన్నో. నిద్రపోని చందమామని భుజానేసుకొని.. ఆదివారం రాత్రంతా పురాస్మృతుల్లో పయనించిందీ నగరం. వరల్డ్ హెరిటేజ్ వీక్‌లో భాగంగా హైదరాబాద్ ట్రాయిల్స్ నిర్వహించిన నైట్ వాక్‌లో... వందలాది మంది విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విదేశీయులు చార్మినార్ చెంతచేరి చరిత్రతో కరచాలనం చేశారు. అలా నిషీధి   రేయి ఉషారు గీతం ఆలపించింది నిద్రపోని నగరం.


నది ఒడ్డున నిల్చున్న అతని మదిని ఏవేవో ఆలోచనలు ముసురుకున్నాయి. ఎదురుగా ఉస్మానియా దవాఖాన. ఇంచుమించు వందేళ్ల వయసుంటుంది కాబోలు. ఎన్ని లక్షల ప్రాణాలిక్కడ పదిలమయ్యాయో. ఎన్ని శ్వాసలిక్కడ ఆగిపోయాయో. ఎన్నెన్ని జీవితాలు... ఇక్కడి నుంచే ఆరంభమయ్యాయో. చూడముచ్చటైన నిర్మాణం కదా... నిజాం ఆలోచనకు రూపురేఖలిచ్చిన బ్రిటీష్ ఆర్కిటెక్చర్ విన్సెంట్ ఇన్నేళ్లుగా నగరంలో సజీవంగానే ఉన్నట్లుంది. రేపటిసంగతేమో కానీ... ఇప్పటికైతే అతనికిది నది ఒడ్డున దిగిన పాలపుంత. ఇంతలోనే ఎవరో పిలిచినట్లుగా.. పురానాపూల్ దాటుకొని సాలార్జంగ్ మ్యూజియం వైపు అడుగులేశాడు. అదిగో...లోపలి నుంచి ఏవేవో శబ్ధాలు. చరిత్రని సజీవంగా పదిలపరిచిన వస్తుసామగ్రి గుసగుసలు. కాస్తముందుకెళ్లి నయాబ్ హోటల్ చేరుకున్నాడు. అంతే...వెలుగు పూల జాతరలో కలియతిరిగేందుకు రెండు పాదాలకు తోడు రెండు వందల పాదాలు జతకూడాయి.




ఇరానీ గుమగుమలు..
యే షహర్ నిషానీ హై ఇరానీ చాయ్. నయాబ్ హోటల్‌లో నడక సాగిస్తే... మలాయి పౌనా గుమగుమలు మనసును మెలిపెడతాయి. వంట గదిలో రుమాలీ రోటీ గాలిలోకెగురుతుంటుంది. కట్టెల పొయ్యి మీద మరుగుతున్న పాలు...మత్తుగొలుపుతాయి. కప్పులో చాయ్‌ని గుటకేసేలోపు గోపాలకృష్ణ ఏవేవో కథలు వినిపించాడు. యే షహర్ కీ కహానీ.. రెపరెపలాడే జెండాపై కుల్చా ఎందుకు కొలువుదీరిందో... ఏడు తరాల నిజాం కథని నిమిషాల్లో వినిపిస్తాడు. నయాబ్ హోటల్ వెనక గల్లీలోంచి నడుస్తు ఉంటే...చత్తా బజార్ చరిత్ర మనకు తారసపడుతుంది. తొలినాటి ముద్రణ ముచ్చట్లు ఔరా అనిపిస్తాయి. 



చరిత్రలోకి..
మదీనా వైపు అడుగులేస్తుంటే... పత్తర్‌గట్టీ పలకరిస్తుంది. చుట్టుపక్కల చూపు సారిస్తే... కాస్త దూరంగా దివాన్‌దేవ్డీ దర్శనమిస్తుంది. మీర్ చౌక్ రోడ్డు మురిపిస్తుంది. ప్రతి కట్టడానికీ ఓ కథ ఉన్నట్లే... గల్లీ గల్లీ ఓ గాథ ఉంది. నాటి ఊసులన్నిటినీ కళ్లముందు కుప్పపోసి ఒక్కొక్కటి వినిపించింది అరుణిమా. చార్మినార్‌కు నలుదిక్కులా నిలిచిన ద్వారాలు స్వాగతమంటాయి. కాలీ కమాన్ చెప్పే కథలు వింటూ...మచిలీ కమాన్ ముచ్చట్లు వింటూ... షేర్ ఏ బాటిల్ కమాన్...లోంచి చార్ కమాన్ వైపు నడక సాగిస్తే నాలుగు వందల ఏళ్ల చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. దారి మధ్యలో రోడ్డుపక్కన టిఫిన్ బండి, అక్కడ వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ నోరూరిస్తాయి.



వెలుగు పూలు..
చార్మినార్ చెంత చేరితే... వెలుగు పూలు స్వాగతమంటాయి. నక్షత్రాల నీడలో చందమామతో చెలిమి చేస్తూ నిశ్చలంగా నిలుచున్న నాలుగు వందల ఏళ్ల నగర నిశానీ ఇది. పక్కనే మక్కా మసీదు... ముచ్చటగా పిలుస్తుంది. ఎదురుగా యునానీ ఆసుపత్రి పాలపుంతలా వెలుగుతుంది. వారెవ్వా ఇన్ని అందాల్ని ఎక్కడ చూడగలం. ఒక్క బాగ్‌నగర్‌లో తప్ప. రాతిరంతా మేల్కొని.. చందమామకు సోపతిగుండే సిటీ ఇది. ఇంత అందమైన నగరంతో ప్రేమలో పడని వారెవరుంటారు. అందుకే... రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలు...దేవకొండ బాలగంగాధర్ తిలక్.... సరోజినీ నాయుడు వరకు ఎందరెందరో కవులు...నగర అందాలకు తమ అక్షరసుమాలర్పించారు. మీరూ ఈ రాత్రిపూల వెలుగులో నగర అందాల్ని వీక్షించాలనుకుంటున్నారా..! అయితే పాతబస్తీ వైపు పాదాల్ని తిప్పండి.


Monday, 16 November 2015

క‌విత్వం కురిసిన ఉద‌యం..


పాత‌న‌గ‌రంలో ప్ర‌భాత‌గీతం... దర్గాపై రెపరెపలాడిన సూఫీ సంగీతం



ఇంకా... నగర జనం మేల్కొలేదు కాబోలు. పాతబస్తీ వీధులు ప్రభాత గీతం వినిపిస్తున్నాయి. తంబూర మోతకు దో తారా జత కూడింది. విపుల్ గాత్రానికి షబ్నం కోరస్ అయ్యింది. దారుషిఫా దర్గాలో కబీర్ కవిత్వం కురుసింది. ఈ ప్రభాత గీతం... నిద్రపోతున్న వాళ్లన్ని మేల్కొల్పడానికి కాదు... మనుషులుగా మరణిస్తున్న వాళ్లకు మానవత్వాన్ని గుర్తుచేయడానికి. అవును.. ఆదివారం ఉదయం... పాతబస్తీకి సూఫీ పరిమళం సోకింది. అది హైదరాబాద్ ట్రాయిల్స్ అంటించిన సంగీత సంచార జ్వరం. ఆ జ్వర తీవ్రత మీకూ అంటుకోవచ్చు.



మీరెప్పుడైనా చరిత్రలోకి తొంగి చూశారా? పాతనగరం వీథుల్లో... పాడుబడిన రాతి గోడను పలకరించారా? గోడపై పరుచుకున్న పచ్చని నాచుని మునివేళ్లతో తడిమి చూశారా? వేనవేల అనుభవాలు కథలు కథలుగా వినిపిస్తాయి. శతాబ్ధాల చరిత్ర కళ్లమందు స్క్రోల్ అవుతుంది. అక్కడే ఆగిపోయేరు సుమా! మీ చెవుల్లోకి సుస్వర గీతమొకటి చొరబడి కలవరపెడుతుంది. చరిత్రతో మీ సంభాషణకు అంతరాయం కలిగిస్తుంది. ఇంతలో.. అటు పక్క నుంచి ఎవరో పలకరిస్తారు. ఏవేవో ముచ్చటిస్తారు. అలా.. మూల మలుపు తిరగ్గానే... ఇరానీ ఛాయ్ ఈల వేస్తుంది. వీధి చివర.. గులాబీ జామ్ తరసపడుతుంది. ఇంతకూ ఏమవుతుందో తెలుసా.. ? మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఆదివారం సూఫియానాలో పాల్గొన్న వారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. 


సూఫియానా
ఇంతకూ సూఫియానా సంగతేంటనుకుంటున్నారా? అక్కడే వస్తున్నా. భారతీయ సంస్కృతిలో భాగమైన భక్తి ఉద్యమం, సూఫి తత్వం జనసామాన్యానికి కొత్త చూపునిచ్చాయి. కుల, మతాల అంతరాలను కూలదోసి... మనవత్వాన్ని పరిమళించాయి. అలా.. సమానత్వ భావాల్ని వెదజల్లిన కవి, గాయకులు ఎందరెందరో. వాళ్లు బోధించిన విలువల్ని ఇప్పటికీ పలువురు ఆచరిస్తున్నారు. ఉత్తర భారతంలో ప్రభాత్ ఫేరి పేరుతో తెల్లవారుజామున భక్తి గీతాలాలపిస్తూ నగరమంతా సంచరిస్తుంటారు సూఫీ గాయకులు. ఇప్పుడు నగరంలోనూ సూఫియానా పేరుతో... అలాంటి సంగీత సంచారానికి తెరతీసింది హైదరాబాద్ ట్రాయిల్స్. సూఫీ గీతాల్ని ఆలపిస్తూ ఓల్డ్ సిటీలోని చారిత్రక దర్గాల్ని సందర్శించడం సూఫియానా ఉద్దేశ్యం. వివిధ రాష్ర్టాలకు చెందిన సుమారు వంద మందికిపై విద్యార్థులు, ఉద్యోగులు ఈ సూఫీవాక్ పాల్గొని సంగీత సాగరంలో మునిగిపోయారు. 



చారిత్రక నగరంలో...
హైదరాబాద్ చారిత్రక నగరం.. నాలుగు వందల ఏళ్ల పైబడిన చరిత్ర ఈ నగరం సొంతం. ఎన్నో చారిత్ర కట్టడాలు. మసీదులు.. మందిరాలు.. దర్గాలు. భక్తి ఉద్యమం, సూఫీయిజంతోనూ విడదీయరాని బంధం. అలాంటి నగరంలో సూఫీ తత్వాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నయే సూఫియానా( సంగీత సంచారం). ఆదివారం ఓల్డ్‌సిటీలోని దారుషిఫా దర్గా నుంచి మొదలై పలు చారిత్రక దర్గాల మీదుగా ఈ సంగీత సంచారం సాగింది. ప్రముఖ ఫిల్మ్ మేకర్ షబ్నం, రచయిత విపుల్‌తో పాటు సూఫీ కళాకారులు నీల్, ప్రేమ్‌సాగర్, రాహుల్, మల్లిక్‌లు తమ సంగీతంతో శ్రోతలను అలరించారు. దారుషిఫా నుంచి చెత్త కమాన్, దివాన్ దేవిడి, అల్లాడిన్ బిల్డింగ్, ఉర్దూ గల్లీ, మచిలీ కమాన్, ఇరానీ గల్లీ, మీరాలం మండి మీదుగా గుల్జార్ హౌజ్ వరకు సాగిన సూఫియానా వాక్‌లో పలు చారిత్రక దర్గాలతో కరచాలనం చేశారు. మధ్య మధ్యలో కళాకారులు కబీర్, కృష్ణ గీతాలతో అలరించారు. తంబూర శబ్ధం, గిటార్ ధ్వనికి దోతార జతకూడుతుంది. వెదురు పవనపు గీతమై డిడ్జెరిడూ మైమరిపించింది. సూఫీ సంగీతాన్ని వింటూ మైమర్చిపోయారు నగరవాసులు.



మధురానుభూతులు
సూఫియానాలో కొత్త కొత్త పరిచయాలు. భిన్న సంస్కృతుల మధ్య ఆధాన ప్రధానాలు. ఎన్నెన్నో సంభాషణలు. దారి మధ్యలో నయాబ్ హోటల్ సేదతీరమంటుంది. వంట గదిలో... కట్టెల పొయ్యిపై మరిగే పాలు గుమగుమలాడుతాయి. ఇరానీ ఛాయ్ వాహ్వా అనిపిస్తుంది. పత్తర్‌గట్టి రోడ్డులో.. పాత సామాను పరిమళం సోకుతుంది. మచిలీ కమాన్ ముందు వేడి వేడి గులాబీజామ్ గుమగుమలాడుతుంది. అర్కిటెక్చర్ విద్యార్థులు... మినారు నుంచి వేలాడే చెట్ల ఆకుల్ని చిత్రిస్తుంటారు. అలా మాటలు.. పాటలు.. చారిత్రక ఊసులు.. మదినిండా నింపుకొని చార్మినార్ సాక్షిగా.. సూఫియానా సెలవందిస్తుంది. ఇది పాత బస్తీ ప్రభాత గీతం.. ఎన్నెన్ని మధురానుభూతులో. మళ్లీ మళ్లీ సొంతం చేసుకోవాలనిపించే సంగతులు. ఇది పురానా షహర్ పులకింత. 





 అవి భక్తి కీర్తనలైనా... సూఫీ గీతాలైనా... మానిషితనాన్ని ప్రేమించేవే. అవి ధిక్కార స్వరాలు.. ఆధిపత్యాన్ని ప్రశ్నించిన గొంతుకలు. మానవత్వాన్ని చాటిన ఉద్యమాలు. మతాలు, కులాల మధ్య అంతరాలను తుడిచేసిన మాద్యమాలు. సమానత్వాన్ని బోధించిన జన జీవన విధానాలు.. అతను కబీరు కావచ్చు.. గురు నానక్ కావచ్చు... అన్నమయ్య కావచ్చు.. మీరాబాయి కావచ్చు. వాళ్లు మనలో కొత్త ఆశల్ని చిగురింపజేసినోళ్లు.



(నా కెమెరా క‌న్ను క్లిక్‌మ‌నిపించిన ఛాయాచిత్రాల‌కు... జ‌త‌కూర్చిన‌ నాలుగు అక్ష‌రాలు - న‌మ‌స్తే తెలంగాణ‌లోని క‌థ‌నం)

పహాడ్ కీ కహానీ



భాగమతి - కులీ కుతుబ్‌షాల‌ ప్రేమ గీతం
రాతి శిలలు పలుకు రాగాల ఝురి
నగారాలు వినిపించే ఫర్మానాలు కొన్ని
నిర్మాణాల వెనక దాగిన కథాకమామీషులెన్నో
యే హైదరాబాద్ కీ కహానీ


ఇందు మూలంగా... 
నగర జనులకు తెలియజేయునది ఏమనగా....

అదిగో... నౌబత్‌ప‌హాడ్ నగరా మోగింది. అప్పుడే ఆల్ ఇండియా రేడియో రాగమొత్తుకుంది. ఫతే మైదాన్లో పావురాల గుంపు రివ్వున గాలిలోకెగిరింది. టౌన్‌హాల్ ముందు బాపూ బొమ్మ మౌనంగా వింటూనే ఉంది. ట్యాంక్‌బండ్‌ విగ్రహాలు ఠీవీగా నిల్చున్నాయి. సాగర మధ్యన బుద్ధుడు ధ్యానం వీడాడు. బిర్లా టెంపుల్లో బాలాజీ చిరునవ్వులొలికాడు. ఇంతకూ... ఏం వినాలని? ఔరంగజేబు ఫర్మానాలు వినేందుకు కాదు.. పహాడ్‌పై పుట్టిన పురాస్మృతుల్ని వినేందుకు. నాలుగు వందల ఏళ్ల నగర గాథ వినేందుకు. అవును... ఆదివారం ఉదయం వినిపించిన ఏ స్టోరీ ట్రైల్ ఆఫ్ నౌబత్ పహాడ్ నడక అది.



వందలాది పాదాల వడి వడి నడక. దారి వెంట రాలుతులున్న రాగాలు కొన్ని. పాటకు పాటకూ మధ్య పాత జ్ఞాపకాలు కొన్ని. నవాబులు... షరాబులు.. గరీబులు. తవ్విన కొద్దీ తారసపడే పాత్రలు ఎన్నో. కుతుబ్‌షాహీలు... తానీషాలు.. అసఫ్‌జాహీలు.. ఎందరెందరో ఏలిన ప్రభువులు.. ఎందరెందరో పాలిత ప్రజలు. కళ్లముందు కదలాడే చరిత్ర అది. అవును.. దీపా కిరణ్, గోపాలకృష్ణ వినిపించే కథలు.. మనల్ని చరిత్రలోకి నడిపించుకెళ్తాయి. అక్కడ... భాగమతి కాలి అందెల సవ్వడి వినిపిస్తుంది. కులీ కుతుబ్ షా కవన ఝురి ప్రవహిస్తుంది. ఔరంగజేబు అశ్వక దళమూ... ఉస్మాన్ అలీ ఖాన్ కళాతృష్ణ కనిపిస్తుంది. మధ్య మధ్యలో కృష్ణ దేవరాయుడు, తెనాలి రామకృష్ణులూ తారపడతారు. పరమానందయ్య శిష్యులూ పలకరిస్తారు. ఆదివారం హైదరాబాద్ ట్రాయిల్స్, స్టోరీ ఆర్ట్స్ ఇండియా నిర్వహించిన వాక్లో అలాంటి కథలెన్నో వినిపించాయి.

ఏటవాలు నడక
రవీంద్రభారతి మీదుగా అసెంబ్లీని దాటుకొని వెళ్తుంటే... గన్‌పార్క్‌ నిన్నటి జ్ఞాపకాలని పంచుతుంది. అలా ఎడమ వైపు మలుపు తిరిగితే... దారికి ఇరువైపులా పరుచుకున్న పచ్చదనం. నడక ఏటవాలుగా సాగుతుంటుంది. కాస్త ఎత్తుకు వెళ్తామా... ఎదురుగా శిథిల భవనమొకటి తారసపడుతుంది. ఒకనాడు దగదగలతో వెలుగొందిన హిల్‌ఫోర్ట్‌ ప్యాలెస్ అది. పాపం పర్యాటక శాఖ మాత్రం ఏం చేస్తుంది! చుట్టూ ఓ కంచెను కట్టి వదిలేయడం తప్ప. వానకారు కోయిలలా చిన్నబోయిన ప్యాలెస్ పాత గోడలు. నిన్నటి వైభవోపేత స్మృతుల్ని నెమరేస్తుంటాయి. సరిగ్గా వందేళ్ల క్రితం.. నిజాం ఏలికలో ప్రధాన న్యాయమూర్తి సర్ నిజామత్ జంగ్ నిర్మించిన ప్యాలెస్ అది. చానాళ్ల పాటు నగర అభివృద్ధి బోర్డు కార్యాలయంగా సేవలందించిన భవనమూ అదే. కానీ ఇప్పుడు అదంతా జ్ఞాపకమే.


నగరా మోగిన వేళ
అదిగో... హిల్‌ఫోర్ట్‌ ప్యాలెస్ దాటుకొని వెళ్లి... అలా ఎడమవైపు తిరిగితే.... అక్కడే నౌబత్ పహాడ్. పరిసర ప్రాంతాల కంటే.. ఇంచు మించు 300 అడుగుల ఎత్తున. ఆ గుట్ట మీద బిర్లా ప్లానిటోరియం. కాస్త అటు పక్కనే బిర్లా మందిరూ. ఈ పహాడ్ ముచ్చట్లేంటో తెలుసా... అప్పుడెప్పుడో ఔరంగజేబు రోజూ ఈ గుట్ట మీదికి వచ్చే వాడంట. గుట్టపైన పెద్ద నౌబత్ (డ్రమ్, డోలు, నగారా) ఉండేదట. దాన్ని మోగించి ప్రజలకు ఇక్కడి నుంచి ఫర్మానాలు జారీ చేసేవారట. అలా ఈ ప్రాంతానికి నౌబత్ పహాడ్ అని పేరొచ్చింది. అంతే కాదు... ఆమీర్ అలీ అనే బంధిపోటు నౌబత్ పహాడ్ నుంచి హుస్సేన్ సాగర్‌ని చూసి... మహాసముద్రాన్ని చూసినంత ఆనందించేవాడట. అప్పటి బ్రిటీష్ రెసిడెంట్ టేలర్ రాసిన కన్ఫెషన్ ఆఫ్ ఏ థగ్ పుస్తకంలో నౌబత్ పహాడ్, హుస్సేన్‌సాగర్ గాథల్ని వివరించాడు. అవును మరి... రెండు నగరాల మధ్య గల మానవ నిర్మిత కాసారమది. నిజంగా అద్భుతమే.



ప్రణయ గాథలు
అంత ఎత్తున నక్షత్రశాల ఒకటి. అందులోకి అడుగు పెడితే ఎన్నెన్ని అద్భుతాలో. అవును... ఆకాశంలో నక్షత్రాలు మనతో ముచ్చటిస్తాయి. అలాంటి చోట.. దీపా కిరణ్ కథలో తెనాలి రామకృష్ణుడు తళుక్కున మెరుస్తాడు. ఇంతలో మోహిత్ గార్గ్ కులీ కుతుబ్‌షా  ప్రేమగీతం ఆలపిస్తాడు. మూసీ నది ఒడ్డున వికసించిన ప్రణయ గాథ. భాగమతి కాలి అందెల సవ్వడి... కులీకుతుబ్ షా కవన ఝురిని ఏకం చేసిన ప్రేమ గాథ. విని తీరాల్సిందే. ఆ ప్రేమ గాథ సాక్షిగా నిర్మితమైన ఈ నగరంలో... ఎన్నెన్ని అందాలు. ఎన్నెన్ని జాపకాలు. ఎన్నెన్ని మెరుపులు. ఎన్నెన్ని ఉరుములు. పూలతోటల.. ప్రేమ కథల... ఎత్తైన గుట్టల... రాజ్యం కదా ఇది. అప్పుడెప్పుడో అమాయకుడు చిత్రంలో పట్నంలో శాలిబండ... పేరైనా గోలుకొండ పాట వినుంటాం కదా. అది నిజమే.. ఒక్క నౌబత్ పహాడ్... గోల్కొండే కాదు.. ఇక్కడి అణువణువు ఓ కథ వినిపిస్తుంది. అది జగద్గిరి గుట్ట, చాంద్రాయణ గుట్ట, పార్శి గుట్ట, అడ్డగుట్ట, మౌలాలీ గుట్ట ఏదైనా కావచ్చు... అది నౌబత్ పహాడ్, కాలా పహాడ్, హకీషా కీ పహాడ్, గోల్కొండ, నయా ఖిల్లా, పహాడీ షరీఫ్ లూ కావచ్చు.. లేదా... బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాగార్జునా హిల్స్ (పంజాగుట్ట), హిల్ ఫోర్టు, రెడ్ హిల్సూ కావచ్చు... అడుగడుగునా... ఓ తోట కనబడినట్లే... ఓ గుట్ట కనిపిస్తుంది. అటు వైపు అడుగులేస్తే... అది వినిపించే కథలో.. నవాబులో, పైగాలో, ప్రధానులో ఉండనే ఉంటారు.

(న‌మ‌స్తే తెలంగాణ కోసం రాసిన అక్ష‌రాలు)

శోక గీతం


ఆశన్న ఊషన్న అన్నదమ్ములంట
ఆశన్న ఊషన్న తలకాయలను 
దుష్టులు లెవ‌రో న‌రికినార‌ట‌
కారిన నెత్తురు కత్తిపీర్లు
చిల్లిన నెత్తురు చిన్న పీర్లు
పేరిన నెత్తురు పెద్ద పీర్లు

దర్గాపై నల్ల జెండా.. లోపలినుంచి ఒక శోక గీతం. కన్నీళ్లు వరదలై పారే... ఒక మూకుమ్మడి రోదన. ఆలంపై తల వాల్చిన చిన్నారి చూపుల్లో... ఏదో ఆర్థ్రత. ఎవరి కోసం ఈ కన్నీళ్లు? ఎందుకీ విషాదం? తెరలు తెరలుగా ప్రశ్నలు. మది మదిలో పదిలమైన హుస్సేన్ జ్ఞాపకం కదా అది. నీతి కోసం నెత్తురు దారపోసిన ఓ నాయకుడి స్మరణ కదా. అవును.. బాద్‌షాహీ అసుర్ ఖానాలో అడుగు పెడితే ఇలాంటి దృశ్యమే కంటపడుతుంది. పదిరోజుల పాటు నెలకొన్న ఓ విషాద సన్నివేశవేషం ఇది. ఎప్పటికీ న్యాయమే గెలవాలనే ఆకాంక్షను ఎల్లడెలా చాటే మనుషులు వాళ్లు. ఆ నిండు మనుషుల మది పులకింతే మొహర్రం.



చరిత్రలో ఎన్నెన్ని విషాదాలో... ఎన్నెన్ని త్యాగాలో... ఎంతెంత నెత్తురొలికిందో. జ్ఞాపకాలను తవ్వే కొద్దీ... తగిలే గాయాలెన్నో. వాటన్నిటినీ తడుముతూ ఇప్పుడు నగరం శోకగీతం వినిపిస్తోంది. ఈర్షా ద్వేషాలు, పగలు, ప్రతీకారాల కంటే.. ప్రేమలోని గొప్పతనాన్ని చాటుతోంది. ఒక సత్యాన్ని గెలిపించేందుకు త్యాగానికీ వెనకడాని మానవీయతను మననం చేసుకుంటోంది. అవును.. మొహర్రం మోసుకొచ్చే సందేశమిదే. తమ కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల జాపకాలను గుండెలనిండా పదిలపరుచుకున్న జనం. కన్నీళ్లతో నిండు జీవితాల్ని కాంక్షిస్తున్నారు.


కర్బలా నెత్తుటి జ్ఞాపకం
ఎప్పుడూ సందడిగా హుషారుగా కనపించే నగరం.. ఇప్పుడెందుకో విషాదంలో మునిగిపోయింది. ఆ మాటకొస్తే ఒక్క నగరమే కాదేమో... ఈ భూమిపై ఇస్లాంని విశ్వసించే ప్రజలందరూ ఇలాంటి విషాదంలోనే ఉండి ఉంటారు. ఎందుకా అనుకుంటున్నారా? 1400 వందల ఏళ్ల క్రితం ప్రాణాలర్పించిన హుస్సేన్ జ్ఞాపకాలవి. అవును... బీబీ కా ఆవాలలోనో, బాద్‌షాహీ అసుర్‌ఖానాలోనో అడుగు పెడితే కనిపించే ఆలంలు(పీర్లు) వినిపించే జ్ఞాపకాలవి. పీర్లకు కట్టిన దట్టీలు.. మెడలో వేలాడే గాజులు... కర్బలా కదనరంగాన్ని చూపుతాయి. ఆలంపై తలవాల్చి రోదించే నేత్రాల్లోకి తొంగి చూస్తే హుస్సేన్ నెత్తుటి జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతాయి. మహ్మద్ ప్రవక్త మరణానంతర పరిణామాలన్నీ కథలు కథలుగా వినిపిస్తాయి. ఒక్కరు ఇద్దరు ఇద్దరు కాదు... 72 మంది వీరుల త్యాగాలు. విషప్రయోగంతో ప్రాణమిడిచిన హసన్ జ్ఞాపకం.. వెన్నుపోటుతో అమరత్వం నొందిన హుస్సేన్ జ్ఞాపకం. మదీనా రాజ్య వారసత్వం కోసం యజీద్ మిగిల్చిన విషాదం. ఇప్పుడు నల్లజెండాలా మన కళ్లముందు.




మొహర్రం
కొత్త సంవత్సరం కదా.. వేడుకనుకునేరు. కానీ ఇది సంతాపం. అవును.. ముస్లింలు విశ్వసించే హిజ్రీ క్యాలెండర్‌లో నూతన సంవత్సర ఆరంభమాసం మొహర్రం. కానీ ఇది ముస్లింకు వేడుక కాదు. విషాదం. మహ్మద్ ప్రవక్త మనువడు ఇమామ్ హుస్సేన్ వీరమరణం పొందిన మాసం. పది రోజుల పాటు యుద్ధంలో గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరక్క విలవిల్లాడిన గడ్డుకాలం. యజీద్ కుట్రకు 72 మంది తన సహచరులతో సహా బలియైన మాసం. అందుకే మొహర్రం మాసంలో పాత బస్తీలోని ప్రతి ఇంటి కప్పు మీద నల్ల జెండా ఎగురుతుంది. తమ కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరిస్తూ వారి పేర్లమీద పీర్లను ప్రతిష్టిస్తారు. అసుర్‌ఖానాలో, దారుల్‌షిఫాలో, అలీజా కోట్లలోలో ప్రతీ చోట ఆ జ్ఞాపకాలే తారసపడతాయి.



త్యాగానికి ప్రతీక
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం... నర జాతి చరిత్ర సమస్తం రణ రక్త ప్రవాహ సిక్తం అన్నట్లు.. ప్రపంచంలోని భాదితులందరీ ఒకే స్థితి అని చాటుతుంది మొహర్రం. ఆ చరిత్ర సాక్షిగా నగరం మొహర్రం పది రోజుల పాటు సంతాపదినాలు జరుపుకుంటుంది. ఏ వీథికేసి చూసినా... నల్ల జెండాలు. మొహర్రం మొహర్రం 6వ రోజు నుంచి 10 వ రోజు వరకు ముస్లింలు ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. యుద్ధ సమయంలో హుస్సేన్ అతని సహచరులు పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ విలవిల్లాడి పోతారు. అలాంటి స్థితి ఎవరికీ రావొద్దని షర్బత్,ఎండు ఫలాలతో రొట్టెలు చేసి పంచుతుంటారు. షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ.. తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మాతం(శోక ప్రకటన)లో పాలొంటారు. బీబీకా ఆలావా మొదలు.. అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌజ్, మీరాలం మండి, దారుల్ షిఫాల మీదుగా చాదర్ ఘాట్ వరకు సాగుతుంది. పీర్లు... నిప్పుల గుండాలు... గుండెలు బాదుకునే సన్నివేశాలు.. శరీరాల్ని చీల్చే కుత్తులు... పారే నెత్తురు.. కలిసిన శోక గీతం ఇది. ధర్మం కోసం పోరాడేటప్పుడు ప్రాణం గురించి ఆలోచించకూడదు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మిన సిద్ధాంతాన్ని వీడొద్దు అంటూ సందేశమిస్తుంది ఈ గీతం. 
(న‌మ‌స్తే తెలంగాణ కోసం రాసిన అక్ష‌రాలు)

Monday, 9 November 2015

స‌హ‌జ అందాల సంగమం భాగ్య‌న‌గ‌రం : ర‌మా మెల్కోటే


నాటి న‌గ‌రం.. నంద‌న‌వ‌నం : ఎల్లూరి శివారెడ్డి


సైకిల్‌పై సిటీ అంతా తిరిగే వాళ్లం : అక్కినేని కుటుంబ‌రావు


ఒకే వేదిక‌పై తెలుగు, ఉర్ధూ క‌విత్వం : న‌గ్న‌ముని


బ‌షీర్ క్యాంటీన్ మా అడ్డా : వ‌ర‌వ‌ర‌రావు


విద్వేషాలెరుగ‌ని న‌గ‌రం : ప్రొఫెస‌ర్ జ‌య‌ధీర్ తిరుమ‌ల‌రావు


న‌గ‌రానికి లాల్ స‌లామ్ : గ‌ద్ద‌ర్‌


జ‌ట్కాబండిలో షికారు మ‌ర‌పురానిది : ఎం.టి.ఖాన్‌


నుమాయిష్‌లో మిర్చి అంటే భ‌లే ఇష్టం : డాక్ట‌ర్ రాజారెడ్డి


షేర్వాణిలో కాలేజీకి : చుక్కా రామ‌య్య‌


పెళ్లికూతురులా ముస్తాబైన న‌గ‌రం : ఆశారాజు



ఆప్యాయ‌త‌ల్ని కోల్పోతున్న న‌గ‌రం : నిఖిలేశ్వ‌ర్‌


డ‌బ‌ల్ డెక్క‌ర్ - సిటీ చ‌క్క‌ర్ : ముదిగంటి సుజాతా రెడ్డి


వెన‌క బెంచీ స్టూడెంట్‌ని : త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌


హైద‌రాబాద్‌కి హ‌వా.. ఏక్ లాఖ్‌కీ ద‌వా : ప‌ర‌వ‌స్తు లోకేశ్వ‌ర్‌