Sunday 6 December 2015

మాయమైన మనుషుల కోసం - ఇఫ్ఫత్ ఫాతిమా



ఇది కశ్మీర్ కన్నీటి గాథ...
రాజకీయ పరిష్కారం కావాలి

మాయమైన మనుషుల కోసం సాగే అన్వేషణ. రోజులు..నెలలు.. సంవత్సరాలు.. దశాబ్ధాలు గడిచిపోతాయి. కానీ ఆ అన్వేషణకు ముగింపు మాత్రం కనబడదు. ఒక్కరిద్దరు కాదు..దాదాపు 20వేల మంది అదృశ్యమయ్యారక్కడ. భర్తకు దూరమైన భార్య.. అన్నను కోల్పోయిన తమ్ముడు.. తండ్రి తలుచుకునే కూతురు..బిడ్డను పోగొట్టుకున్న తల్లి.. ఇలా ఎందరెందరో. లక్షలాది మంది తమ రక్త సంబంధీకుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఏమయ్యారు... వాళ్లందరూ? ఎక్కడికి పోయారు? అసలు.. బతికున్నారా? తిరిగొస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానాలుండవు. గుమ్మానికి ఎదురు చూపులు మిగిలే ఉంటాయి. చెల్లని చట్టాల సాక్షిగా... పదే పదే న్యాయస్థానాలు వెక్కిరిస్తుంటాయి. ఈ కన్నీటి గాథ వెంట సుదీర్ఘ ప్రయాణం చేసిందామె. తుపాకీ నీడన తెల్లవారే రాత్రి ఎన్నెన్ని విషాదాల్ని మిగిల్చిందో కళ్లకు కట్టింది. ఆమే...కశ్మీరీ ఫిల్మ్‌మేకర్ ఇఫ్ఫత్ ఫాతిమా. కల్లోల కశ్మీరాన్ని తొమ్మిదేళ్లపాటు శ్రమకోర్చి దృశ్యమానం చేసింది. కూన్ దీయ్ బారవ్ పేరిట ఆమె రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రాన్ని శుక్రవారం లామకాన్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె తన అనుభవాలను నమస్తేతెలంగాణతో పంచుకుంది. కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం తప్ప సాయుధ పరిష్కారం సాధ్యంకాదంటున్న ఫాతిమా చెప్పే ముచ్చ‌ట్లు ఆమె మాటల్లోనే.


అదృశ్య‌మైన వాళ్లెంద‌రో...
మనుషులు మాయమవ్వడం ఓ గంభీరమైన సమస్య. కశ్మీర్‌లో నిత్యకృత్యంగా మారిన ఈ అంశాన్నే వస్తువుగా తీసుకొని డాక్యుమెంటరీ రూపొందించాలనుకున్నా. కౌంటర్ ఇన్సర్జెన్సీ పేరిట కశ్మీర్‌లో జరుగుతున్న హక్కుల అణచివేతను ప్రపంచానికి చాటాలని ప్రయత్నించా. ఒక్క వ్యాలీలోనే ఇప్పుటి వరకు 10వేల మందికిపైగా అదృశ్యమయ్యారు. వాళ్ల కుటుంబాల ఆరాటాన్ని, పోరాటాన్ని నా చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాను. వాళ్ల ఆవేదనను అర్థం చేసుకునేందుకు  ఆ కుటుంబ సభ్యులతో కలిసి సుదీర్ఘ సమయం గడిపాను. ఈ ప్రయత్నంలో నా డాక్యుమెంటరీ పూర్తవడానికి దాదాపు 9 ఏళ్ల సమయం పట్టింది.
వెతలతో ముడిపడిన జీవితం
నేను కశ్మీరీ మహిళను. అక్కడి వెతలతో ముడిపడిన జీవితం నాది. అందుకే ఈ కథను ఎంచుకున్నా. అందుకోసం నెలల తరబడి, ఏళ్ల తరబడి బాధిత ప్రజలతో గడిపి...వాస్తవాల్ని చిత్రించేందుకు ప్రయత్నించాను. ఇత రక్త సంబంధీకుల్ని కోల్పోయిన కుటుంబ సభ్యులు తమ కన్నీళ్లను కూడా దాచుకోవాల్సిన స్థితి. తమ ఆవేదను కూడా స్వేచ్ఛగా ప్రకటించలేని భయానక పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. వాటి చిత్రీకరణకు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్న. అక్కడ నిజానికి మిలింటెంట్‌లు గతంలో ఉన్న స్థాయిలో ఇప్పుడు లేరు. అయినా... మిలిటెంట్ల సాకుతో సామాన్యులపై జరుగుతున్న ఆకృత్యాలు అన్నిఇన్ని కావు.
ఉమ్మడి పోరాటం
కశ్మీర్‌లో ప్రతి కుటుంబం ఓ కన్నీటి కథ వినిపిస్తుంది. ఏళ్లకు ఏళ్లుగా ఎడతెగని ఎదురుచూపులు వాళ్లవి. ఆత్మీయులను కోల్పోయిన వాళ్లంతా ఒక చోట చేరి ఉమ్మడి పోరాటం సాగిస్తున్నారిప్పుడు. అసోసియేషన్ ఆఫ్ పేరెంట్స్ డిసప్పియర్డ్ పర్సన్స్ (ఏపీడీపీ)  పేరుతో సంఘంగా ఏర్పడి తమ గొంతు వినిపిస్తున్నారు. ఇరవై సంవత్సరాలుగా ప్రతి నెల ఒక చోట చేరి తమ దుఃఖాన్ని పంచుకుంటున్నారు. గొంతెత్తి నినదిస్తున్నారు. అదృశ్యమవ్వడం అనేది నేరంగా గుర్తించని దేశంలో..వాళ్లు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇలాంటి కథలెన్నో..నా చిత్రంలో కనిపిస్తాయి.


 ప్రపంచ సమస్య
నిజానికి ఇది ఒక్క కశ్మీర్ సమస్య మాత్రమే కాదు. ప్రపంచ సమస్య. మధ్య భారతం, ఈశాన్య భార తం, శ్రీలంక, లాటిన్ అమెరికా ఇలా... ప్రతీ చోట అణచివేతను ప్రయోగిస్తున్నాయి ప్రభుత్వాలు. అణచివేత ద్వారా సమస్యను దాచిపెట్టాలనుకుంటే సాధ్యం కాదు. మిలిటరీకి ఆర్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ పేరిట ప్రత్యేక అధికారాలను కట్టబెట్టి కశ్మీర్‌ని కల్లోల ప్రాతంగా మార్చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు స్వేచ్ఛగా బతకలేని స్థితి.
 రాజ్య స్వభావం
రాజ్యస్వభావమే అలాంటిది. ఎక్కడైనా ప్రశ్నించడాన్ని సహించదు. ప్రభుత్వాలే ప్రజల హక్కుల్ని కాలరాయడం విషాదం. తమ సొంత ప్రజలపైనే మిలటరీని ప్రయోగించి రోజువారి జీవితాల్ని సైతం దుర్భరంగా మార్చేస్తున్న వైనం సరైంది కాదు. ప్రజల ఆకాంక్షల్ని గౌరవించాల్సి ఉంటుంది. ఒక సుదీర్ఘ పోరాటాన్ని తుపాకీ నీడన తొక్కిపెట్టాలనుకోవడం సరైంది కాదు.
 రాజకీయ పరిష్కారం కావాలి
నిజానికి కాశ్మీర్ సమస్య..రాజకీయ సమస్య. దాన్ని రాజకీయంగా మాత్రమే పరిష్కరించాలి. తప్ప ఆయుధాలతో పరిష్కరించలేరు. మిలిటరైజేషన్ కృరత్వానికి దారితీస్తుంది తప్ప...పరిష్కారానికి కాదు. దేశ విభజన కాలం నుంచి అక్కడ సమస్య ఉంది. గడిచిన ఆరు దశాబ్ధాలకు పైగా అధికారంలోకి వచ్చిన ఏ రాజకీయ పార్టీ కూడా పరిష్కార దిశలో అడుగులు వేయలేదు. అందువల్లే అది హింసకు దారితీసింది. ఫలితంగా ప్రజలు నిత్యం భయం గుప్పిట బతకాల్సిన స్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలు గౌరవించాలి.


- క్రాంతి, సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

No comments:

Post a Comment