Monday 16 November 2015

శోక గీతం


ఆశన్న ఊషన్న అన్నదమ్ములంట
ఆశన్న ఊషన్న తలకాయలను 
దుష్టులు లెవ‌రో న‌రికినార‌ట‌
కారిన నెత్తురు కత్తిపీర్లు
చిల్లిన నెత్తురు చిన్న పీర్లు
పేరిన నెత్తురు పెద్ద పీర్లు

దర్గాపై నల్ల జెండా.. లోపలినుంచి ఒక శోక గీతం. కన్నీళ్లు వరదలై పారే... ఒక మూకుమ్మడి రోదన. ఆలంపై తల వాల్చిన చిన్నారి చూపుల్లో... ఏదో ఆర్థ్రత. ఎవరి కోసం ఈ కన్నీళ్లు? ఎందుకీ విషాదం? తెరలు తెరలుగా ప్రశ్నలు. మది మదిలో పదిలమైన హుస్సేన్ జ్ఞాపకం కదా అది. నీతి కోసం నెత్తురు దారపోసిన ఓ నాయకుడి స్మరణ కదా. అవును.. బాద్‌షాహీ అసుర్ ఖానాలో అడుగు పెడితే ఇలాంటి దృశ్యమే కంటపడుతుంది. పదిరోజుల పాటు నెలకొన్న ఓ విషాద సన్నివేశవేషం ఇది. ఎప్పటికీ న్యాయమే గెలవాలనే ఆకాంక్షను ఎల్లడెలా చాటే మనుషులు వాళ్లు. ఆ నిండు మనుషుల మది పులకింతే మొహర్రం.



చరిత్రలో ఎన్నెన్ని విషాదాలో... ఎన్నెన్ని త్యాగాలో... ఎంతెంత నెత్తురొలికిందో. జ్ఞాపకాలను తవ్వే కొద్దీ... తగిలే గాయాలెన్నో. వాటన్నిటినీ తడుముతూ ఇప్పుడు నగరం శోకగీతం వినిపిస్తోంది. ఈర్షా ద్వేషాలు, పగలు, ప్రతీకారాల కంటే.. ప్రేమలోని గొప్పతనాన్ని చాటుతోంది. ఒక సత్యాన్ని గెలిపించేందుకు త్యాగానికీ వెనకడాని మానవీయతను మననం చేసుకుంటోంది. అవును.. మొహర్రం మోసుకొచ్చే సందేశమిదే. తమ కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల జాపకాలను గుండెలనిండా పదిలపరుచుకున్న జనం. కన్నీళ్లతో నిండు జీవితాల్ని కాంక్షిస్తున్నారు.


కర్బలా నెత్తుటి జ్ఞాపకం
ఎప్పుడూ సందడిగా హుషారుగా కనపించే నగరం.. ఇప్పుడెందుకో విషాదంలో మునిగిపోయింది. ఆ మాటకొస్తే ఒక్క నగరమే కాదేమో... ఈ భూమిపై ఇస్లాంని విశ్వసించే ప్రజలందరూ ఇలాంటి విషాదంలోనే ఉండి ఉంటారు. ఎందుకా అనుకుంటున్నారా? 1400 వందల ఏళ్ల క్రితం ప్రాణాలర్పించిన హుస్సేన్ జ్ఞాపకాలవి. అవును... బీబీ కా ఆవాలలోనో, బాద్‌షాహీ అసుర్‌ఖానాలోనో అడుగు పెడితే కనిపించే ఆలంలు(పీర్లు) వినిపించే జ్ఞాపకాలవి. పీర్లకు కట్టిన దట్టీలు.. మెడలో వేలాడే గాజులు... కర్బలా కదనరంగాన్ని చూపుతాయి. ఆలంపై తలవాల్చి రోదించే నేత్రాల్లోకి తొంగి చూస్తే హుస్సేన్ నెత్తుటి జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతాయి. మహ్మద్ ప్రవక్త మరణానంతర పరిణామాలన్నీ కథలు కథలుగా వినిపిస్తాయి. ఒక్కరు ఇద్దరు ఇద్దరు కాదు... 72 మంది వీరుల త్యాగాలు. విషప్రయోగంతో ప్రాణమిడిచిన హసన్ జ్ఞాపకం.. వెన్నుపోటుతో అమరత్వం నొందిన హుస్సేన్ జ్ఞాపకం. మదీనా రాజ్య వారసత్వం కోసం యజీద్ మిగిల్చిన విషాదం. ఇప్పుడు నల్లజెండాలా మన కళ్లముందు.




మొహర్రం
కొత్త సంవత్సరం కదా.. వేడుకనుకునేరు. కానీ ఇది సంతాపం. అవును.. ముస్లింలు విశ్వసించే హిజ్రీ క్యాలెండర్‌లో నూతన సంవత్సర ఆరంభమాసం మొహర్రం. కానీ ఇది ముస్లింకు వేడుక కాదు. విషాదం. మహ్మద్ ప్రవక్త మనువడు ఇమామ్ హుస్సేన్ వీరమరణం పొందిన మాసం. పది రోజుల పాటు యుద్ధంలో గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరక్క విలవిల్లాడిన గడ్డుకాలం. యజీద్ కుట్రకు 72 మంది తన సహచరులతో సహా బలియైన మాసం. అందుకే మొహర్రం మాసంలో పాత బస్తీలోని ప్రతి ఇంటి కప్పు మీద నల్ల జెండా ఎగురుతుంది. తమ కోసం ప్రాణాలర్పించిన వీరులను స్మరిస్తూ వారి పేర్లమీద పీర్లను ప్రతిష్టిస్తారు. అసుర్‌ఖానాలో, దారుల్‌షిఫాలో, అలీజా కోట్లలోలో ప్రతీ చోట ఆ జ్ఞాపకాలే తారసపడతాయి.



త్యాగానికి ప్రతీక
ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం... నర జాతి చరిత్ర సమస్తం రణ రక్త ప్రవాహ సిక్తం అన్నట్లు.. ప్రపంచంలోని భాదితులందరీ ఒకే స్థితి అని చాటుతుంది మొహర్రం. ఆ చరిత్ర సాక్షిగా నగరం మొహర్రం పది రోజుల పాటు సంతాపదినాలు జరుపుకుంటుంది. ఏ వీథికేసి చూసినా... నల్ల జెండాలు. మొహర్రం మొహర్రం 6వ రోజు నుంచి 10 వ రోజు వరకు ముస్లింలు ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. యుద్ధ సమయంలో హుస్సేన్ అతని సహచరులు పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ విలవిల్లాడి పోతారు. అలాంటి స్థితి ఎవరికీ రావొద్దని షర్బత్,ఎండు ఫలాలతో రొట్టెలు చేసి పంచుతుంటారు. షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ.. తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మాతం(శోక ప్రకటన)లో పాలొంటారు. బీబీకా ఆలావా మొదలు.. అలీజా కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌజ్, మీరాలం మండి, దారుల్ షిఫాల మీదుగా చాదర్ ఘాట్ వరకు సాగుతుంది. పీర్లు... నిప్పుల గుండాలు... గుండెలు బాదుకునే సన్నివేశాలు.. శరీరాల్ని చీల్చే కుత్తులు... పారే నెత్తురు.. కలిసిన శోక గీతం ఇది. ధర్మం కోసం పోరాడేటప్పుడు ప్రాణం గురించి ఆలోచించకూడదు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మిన సిద్ధాంతాన్ని వీడొద్దు అంటూ సందేశమిస్తుంది ఈ గీతం. 
(న‌మ‌స్తే తెలంగాణ కోసం రాసిన అక్ష‌రాలు)

No comments:

Post a Comment